దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో (సెప్టెంబర్ 17, శుక్రవారం) 2.5 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఉదయం 7 గంటల ప్రొవిజనల్ డేటా ప్రకారం మొత్తం 2.15 కోట్లు (2,15,98,046) ఉండగా, రాష్ట్రాలు నివేదించిన మొత్తం వ్యాక్సిన్ డోసులు 2.5 కోట్లకు పైగా ఉన్నాయి. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించి, రికార్డును నమోదు చేసేలా బీజేపీ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం నుంచే బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. మధ్యాహ్నంకు కోటి, సాయంత్రానికే 2 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తిచేశారు. దీంతో ఒకరోజు వ్యవధిలోనే అత్యధిక డోసులు (2.5 కోట్లు) పంపిణీ చేసి భారత్ రికార్డు నెలకొల్పింది. మరోవైపు ఇటీవల పలుసార్లు కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడం దేశంలోవ్యాక్సినేషన్ ప్రక్రియ వేగానికి అద్దంపడుతోంది.
మరోవైపు దేశంలో ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుండగా సెప్టెంబర్ 18, శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.42 కోట్లు (79,42,87,699) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో వయోజన జనాభాలో కనీసం 63.1 శాతం మందికి ఒక డోసు వ్యాక్సిన్ అందించగా, అర్హత కలిగిన జనాభాలో 20.9 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ