విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ, ఉక్కు పరిశ్రమ ఉద్యోగ సంఘాలు సహా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కుపరిశ్రమ ఆర్చ్ వద్ద ఉక్కుపరిశ్రమ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు (మార్చి 5, శుక్రవారం) రాష్ట్ర బంద్ కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రాష్ట్ర బంద్ కు ఇప్పటికే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ సహా పలు ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వ్యాపార సంఘాలు కూడా మద్దతిచ్చాయి.
ఈ క్రమంలో విశాఖ ఉక్కుపరిరక్షణ కోసం చేపడుతున్న రాష్ట్ర బంద్ కు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ బంద్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ నేపథ్యంలో చిత్తూరు మరియు తిరుపతిలో తలపెట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ