రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు శుక్రవారం ఆయా పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ను ఏప్రిల్ 5న విచారణకు జాబితా చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి విపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ దాఖలు చేసిన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ముందస్తు మరియు అరెస్టు తర్వాత అనుసరించాల్సిన మార్గదర్శకాలపై పార్టీలు స్పష్టతను కోరుతున్నాయి.
దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ విపక్షాలు పిటిషన్లో పేర్కొన్నాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రంలోని అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నాయని, దీనికి నిదర్శనం కేంద్ర ఏజెన్సీలు పెట్టిన వాటిలో తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నేతలపైనేనని ఈ సందర్భంగా విపక్షాలు అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. రాజకీయ ప్రత్యర్ధులపై బీజేపీ ప్రభుత్వం ఈ సంస్థలను ఉసిగొల్పుతోందని, అందరినీ తమవైపు తిప్పుకోడానికి, లేదా భయపెట్టడానికి ఈడీ, సీబీఐలను ఉపయోగించి కేసులు పెట్టిస్తోందని వెల్లడించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 5న విచారణ చేపడుతామని తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE