తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. పరీక్ష పత్రాల తయారీ మొదలు పరీక్షల నిర్వహిణ తీరులో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తద్వారా భవిష్యత్తులో పేపర్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నల నిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై టీఎస్పీఎస్సీ బోర్డు ప్రస్తుతం దృష్టి సారించింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిషన్ సభ్యులు సమాలోచనలు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం టీఎస్పీఎస్సీ 25 వేల లోపు దరఖాస్తులు వస్తేనే సీబీటీ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నది. అయితే ఇకపై ఆ సంఖ్యను 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని కమిషన్ భావిస్తోంది. కాగా దేశంలోని పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), ఐబీపీఎస్లు సైతం సీబీటీ పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. దీంతో టీఎస్పీఎస్సీ ఈ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఆయా రాష్ట్రాల్లోని కమిషన్లు అమలు చేస్తున్న విధానాలు, పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా యనే అంశాలపై టీఎస్పీఎస్సీ అధ్యయనం చేయనుంది. తద్వారా బోర్డు పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా సకల జాగ్రత్తలు తీసుకోనుంది. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎంసెట్, ఐఐటీ, మెడికల్ తదితర పరీక్షలకు కంప్యూటరైజ్డ్ విధానం అమలు అవుతోన్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE