దేశంలో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరగనున్న జీ-20 దేశాల సమ్మిట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించి, కార్యాచరణ రూపొందించేందుకు ఈ రోజు (డిసెంబర్ 5, సోమవారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జీ-20 సమ్మిట్ పై జరిగే అఖిలపక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు.
బీజేపీ అధినేత జేపీ నడ్డా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అలాగే ఈ సమావేశాన్ని సమన్వయం చేస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరయ్యే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ సమావేశం సందర్భంగా భారతదేశం జీ20కి అధ్యక్షత వహించడం, ఈ ఏడాది సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసిన కార్యక్రమాల గురించి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రజెంటేషన్ను ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు డిసెంబర్ 1వ తేదీన జీ20 అధ్యక్ష పదవిని భారత్ అధికారికంగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఇండోనేషియాలోని బాలిలో 17వ జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం జీ-20 దేశాల అధ్యక్షత బాధ్యతలను ఇండోనేషియా భారత్ కు అప్పగించింది. భారత్ తన జీ-20 ప్రెసిడెన్సీ/అధ్యక్షత సమయంలో, భారతదేశం అంతటా 55 నగరాల్లో 32 విభిన్న రంగాలలో సుమారు 200 సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. అందులో భాగంగా భారత్ అధ్యక్షతన తొలి జీ20 షెర్పా సమావేశం డిసెంబర్ 4, ఆదివారం నాడు రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో ప్రారంభమైంది. అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ లో సభ్య దేశాల అధ్యక్షులు/ప్రధానుల స్థాయిలో దేశంలో జీ-20 సమ్మిట్ జరగనుంది. భారత్ నిర్వహించనున్న జీ-20 సమ్మిట్ ను అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా ఘనంగా నిర్వహించి, విజయవంతం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE