తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన మేరకు నేడు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాగా వచ్చే ఏడాది భారత్లో జరగనున్న జీ-20 సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించి, రూపొందించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనుండగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయమే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
అయితే గత ఎన్నికలకు ముందు కేంద్రం లోని బీజేపీ పెద్దలతో టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. అయితే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం, అదే సమయంలో టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం తెలిసిందే. అప్పటినుంచి ఈ రెండు పార్టీల మధ్య సరైన సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం ఏపీ రాజకీయాల్లో ఆస్తక్తి రేపుతోంది. గతంలో కూడా ఒకసారి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అప్పుడు ప్రధాని మోదీ, చంద్రబాబు ఇరువురూ కరచాలనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇది అప్పట్లో ఏపీ రాజకీయాల్లో కొంత కలకలం సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ బీజేపీతో పొత్తుకు ఆశావహంగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో మరోసారి చంద్రబాబును కేంద్రం ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE