ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్రవారం బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో భారతదేశ పురోగతి, సహకారం సహా పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీ ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “బిల్గేట్స్ను కలవడం మరియు కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరపడం ఆనందంగా ఉంది. మెరుగైన మరియు మరింత స్థిరమైన ప్రపంచాన్ని సృష్టించాలనే అతని వినయం మరియు అభిరుచి స్పష్టంగా కనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
అలాగే ప్రధానితో భేటీపై బిల్గేట్స్ ట్వీట్ చేస్తూ, “ఆరోగ్యం, అభివృద్ధి మరియు క్లైమేట్ లో భారతదేశం సాధిస్తున్న పురోగతి గురించి ప్రధాని నరేంద్ర మోదీతో నా సంభాషణ గతంలో కంటే మరింత ఆశాజనకంగా ఉంది” అని పేర్కొన్నారు. గత వారం నుంచి బిల్గేట్స్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన విశేషాలను గిల్ నోట్స్ లో బిల్గేట్స్ పంచుకున్నారు. ఆరోగ్యం, క్లైమేట్ చేంజెస్ మరియు ఇతర కీలకమైన రంగాలలో భారత్ లో జరుగుతున్న వినూత్న పని గురించి తెలుసుకున్నానని, ప్రపంచానికి అనేక సవాళ్లు ఉన్న సమయంలో, భారతదేశం వంటి చైతన్యవంతమైన మరియు సృజనాత్మక ప్రదేశాన్ని సందర్శించడం స్ఫూర్తిదాయకమని బిల్గేట్స్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశం కావడం తన పర్యటనలో ప్రధానాంశమని, భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించడంలో సైన్స్ మరియు ఆవిష్కరణలు ఎలా సహాయపడతాయనే దాని గురించి వారివురూ మాట్లాడుకుంటునప్పుడు, ప్రధాని తన సమయాన్ని ఎక్కువుగా కేటాయించడం సంతోషం కలిగించిందన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా తాను గత మూడేళ్లుగా పెద్దగా ప్రయాణించనప్పటికీ, ప్రధాని మోదీ మరియు తాను ప్రత్యేకంగా కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం మరియు భారతదేశ ఆరోగ్య వ్యవస్థలలో పెట్టుబడి పెట్టడం గురించి టచ్లో ఉన్నామని బిల్గేట్స్ తెలిపారు. భారతదేశం చాలా సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరసమైన వ్యాక్సిన్లను తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది, వాటిలో కొన్నింటికి గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుందన్నారు. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన టీకాలు మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను కాపాడాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధులను నిరోధించాయన్నారు. ఆలాగే భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ గురించి కూడా చర్చించామని, భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆవిష్కరణలు ప్రపంచానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో హైలైట్ చేయడానికి మరియు ఇతర దేశాలు వాటిని స్వీకరించడంలో సహాయపడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని అన్నారు. ఈ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా దాని డిజిటల్ ఐడీ మరియు చెల్లింపుల వ్యవస్థలను ఇతర ప్రదేశాలకు విస్తరించడం మా ఫౌండేషన్కు అత్యంత ప్రాధాన్యత అని అన్నారు. క్షయ, విసెరల్ లీష్మానియాసిస్ మరియు లింఫాటిక్ ఫైలేరియాసిస్ వంటి ప్రాణాంతకమైన మరియు బలహీనపరిచే వ్యాధులను తొలగించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని అభినందించానని బిల్గేట్స్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE