గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో నోటీసులు ఇచ్చిన కొన్ని కట్టడాలను తొలగించేందుకు శనివారం అధికారులు యత్నిస్తున్నారు. అయితే కళ్ల ముందే తమ ఇళ్లు కూల్చేస్తుండటంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను అన్యాయంగా కూలుస్తున్నారని, కూల్చివేతలు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరిస్తున్నారు. కూల్చివేతలు సాగకుండా అధికారులను అడ్డుకుంటుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా అధికారులు ముందు జాగ్రత్తగా ఇప్పటంలో పోలీసులను భారీగా మోహరించారు. కాగా వారం రోజుల క్రితమే ఈ ఎనిమిది ఇళ్లను కూల్చేందుకు మున్సిపల్ అధికారులు రాగా, బాధితులు మున్సిపల్ కమిషనర్ను కలిసి కొద్ది రోజుల సమయం కోరడంతో అప్పడు అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
అయితే గ్రామస్థులు అడిగిన గడువు సమయం నేటితో ముగియడంతో, ఈరోజు ఆయా గృహాలను కూల్చివేసేందుకు అధికారులు ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జేసీబీలతో ఇళ్ల కూల్చివేత పనులు మొదలుపెట్టారు. దీంతో తమ ఇళ్లకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా, కక్ష పూరితంగా కూల్చివేస్తున్నారంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఇక దీనిపై కొంతమంది ముందస్తుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూల్చివేత చేపట్టకుండా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. కాగా గతేడాది ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కోసమంటూ పలు ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో గతేడాది పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో అధికారులు కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు. బాధితులకు జనసేనాని పవన్ కళ్యాణ్ అండగా నిలవడంతో పాటు ఆర్ధిక సహాయం చేశారు. అయితే అప్పుడు ఆపేసిన మిగిలిన ఎనిమిది ఇళ్లను కూల్చివేయడం కోసం నేడు అధికారులు చర్యలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE