ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో కానుక అందించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ.400 కోట్లతో హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం’ (సీఏఆర్ఓ) సిద్ధమవుతోందని అన్నారు. ఆసియాలోనే అత్యాధునిక సాంకేతికతతో సివిల్ ఏవియేషన్ రంగంలో అత్యాధునిక పరిశోధనలకు సీఏఆర్ఓ వేదిక కానుందని చెప్పారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు జరగనున్నాయని తెలిపారు.
“ఈ కేంద్రం ద్వారా ఎయిర్ నావిగేషన్, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్స్, డొమైన్ సిమ్యులేటర్స్, నెట్ వర్క్ ఎమ్యులేటర్, సర్వెలెన్స్ ల్యాబ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ అండ్ సిమ్యులేషన్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్ మొదలైన అత్యాధునిక పరిశోధనలు జరగనున్నాయి. భారతదేశంలో తొలి ‘గృహ-5’ ప్రమాణాలతో, ఆసియాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే ఈ కేంద్రం లక్ష్యం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి యావత్ తెలంగాణ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE