నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రేపటినుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గురువారం నాగ్పూర్లో తొలి టెస్టు జరుగనుంది. జూన్ లో జరుగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకం కానుంది. ఇప్పటికే పాట్ కమిన్స్ సారధ్యంలోని ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరుకోగా, జూన్లో లండన్లోని ఓవల్లో జరగనున్న ఫైనల్ పోరుకు చేరుకోవాలంటే రోహిత్ సేన కచ్చితంగా గెలవాల్సి ఉంది. ప్రస్తుతం 58.93 పాయింట్ల శాతంతో, భారతదేశం ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (48.72) పట్టికలో వరుసగా మూడు మరియు నాల్గవ స్థానంలో ఉన్నాయి. దీంతో భారత్ ఆసీస్ను 3-0 లేదా 4-0 తేడాతో ఓడించడం ద్వారా అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో భారత్.. తన జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలు తుదిజట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన మూడు స్థానాల కోసం దాదాపు ఆరుగురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లలో మూడు స్థానాలను దక్కించుకునేదెవరో ఆసక్తికరం కానుంది. ఇక పిచ్ స్పిన్ వికెట్ కు అనుకూలంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లలో ఎవరినో ఒకరినే తీసుకోవచ్చు. అలాగే ఇటీవల ప్రమాదంలో గాయపడి జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో కీపర్ గా ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ లలో ఒకరిని తీసుకోనున్నారు.
అలాగే టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ అరంగేట్రం కోసం ఉత్సుకతగా ఎదురు చూస్తున్నాడు. అయితే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్ స్థానంలో ఆడటానికి సిద్ధమని ప్రకటించడంతో ఓపెనర్ గా శుభ్మన్ గిల్ ను సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో ఉంటాడా? లేదా? అని అనుమానంగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్స్ అందరూ అందుబాటులో ఉండటంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే స్పిన్ పిచ్ నేపథ్యంలో ఆ జట్టు సీనియర్ బౌలర్ నాథన్ లియోన్ కీలకం కానున్నాడు. దీనికి తోడు అతడికి ఇండియాపై మంచి రికార్డు ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేపు ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్ల అంచనా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అష్టన్ అగర్, మార్నస్ లబుషేన్, డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్కాంబ్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE