ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ యొక్క ప్రకటనలకు దూరంగా ఉండాలని, ప్రచురించవద్దని ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాకు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం నాడు ఒక సూచనను జారీ చేసింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మరియు ఆన్లైన్ మీడియాలో ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లు/ప్లాట్ఫామ్స్ యొక్క అనేక ప్రకటనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సూచన చేస్తునట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ మరియు జూదం దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధమని, వినియోగదారులకు, ముఖ్యంగా యువత మరియు పిల్లలకు గణనీయమైన స్థాయిలో సామాజిక, ఆర్థిక ప్రమాదాన్ని కలిగిస్తుందని అన్నారు. నిషేధించబడిన ఈ కార్యాచరణను ఆన్లైన్ బెట్టింగ్పై వస్తున్న ప్రకటనలు ఎక్కువుగా ప్రోత్సహించే ప్రభావాన్ని కలిగి ఉంటాయని అన్నారు.
“ఆన్లైన్ బెట్టింగ్ యొక్క ప్రకటనలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం-2019, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ చట్టం-1995 మరియు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ కౌన్సిల్ చట్టం-1978 అడ్వర్టైజింగ్ కోడ్ మరియు జర్నలిస్టిక్ ప్రవర్తనా నిబంధనల ప్రకారం ప్రకటన నిబంధనలకు ఖచ్చితంగా అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదు” అని సూచనలో పేర్కొన్నారు. ఈ సూచనా పెద్ద స్థాయిలో ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడిందని, ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రకటనలను ప్రచురించకుండా ఉండాలని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సూచించింది. ఆన్లైన్ ప్రకటనల మధ్యవర్తులు మరియు పబ్లిషర్లతో సహా ఆన్లైన్ మరియు సోషల్ మీడియాకు భారతదేశంలో ఇటువంటి ప్రకటనలను ప్రదర్శించవద్దని లేదా భారతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY