ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఖరీఫ్-2021 సీజన్కు సంబంధించి “వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం” నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి భరోసానివ్వడంలో భాగంగా ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2021 ఖరీఫ్ సీజన్ లో ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కింద పంట నష్టపోయిన 15.61 లక్షల రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం అందిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లిలో నిర్వహించిన సభలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నేరుగా ఆ నగదును జమ చేశారు. ముందుగా రాష్ట్రంలో భూమి సాగు చేస్తూ ఈ–క్రాప్లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియమ్ను ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతుల కోసం ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. నేడు 15.61 లక్షల మంది రైతులకు రూ.2977.92 కోట్లను అందిస్తున్నాం. కరువు జిల్లాగా ఉన్న అనంతపురంకు కూడా నేడు దేవుడి దయతో నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి పారదర్శకంగా మంచి జరుగుతోందని, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా ఇవ్వగా, ఈ ప్రభుత్వం మూడేళ్లలోనే మూడు విడతల్లో రూ.6,685 కోట్ల బీమా చెల్లించామని అన్నారు. రైతులకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నామని అన్నారు. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లుతో కలిపి వివిధ పధకాల రైతుల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY