కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఈ లాక్డౌన్ కొనసాగింపుపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరించకముందే ఒడిశా రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా లాక్డౌన్ను మే 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఏప్రిల్ 10, శుక్రవారం సాయంత్రం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు.
ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మంత్రులతో లాక్డౌన్ కొనసాగింపుపై సీఎం అమరీందర్ సింగ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రస్తుతానికి లాక్డౌన్ను మించిన మార్గం లేదని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిపుణులు చెప్తున్న అంచనాలు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగించినప్పటికీ రాష్ట్రంలో రబీ రైతులకు పంట కోతకు అనుమతిస్తామని అన్నారు. మరోవైపు పంజాబ్లో 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.