కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. భారత్ వెయిట్ లిఫ్టర్ గురురాజా పూజారి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజా పూజారి 269 కేజీలు (స్నాచ్లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 151 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలవడంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్లో 151 కేజీలు ఎత్తడం ద్వారా తన కెరీర్ బెస్ట్ లిఫ్ట్ నమోదు చేసుకున్నాడు. 2018 ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించిన గురురాజా పూజారి, ఈ ఎడిషన్ లో కూడా కాంస్యంతో సత్తా చాటాడు. ఇక ఈ విభాగంలో మలేసియా వెయిట్ లిఫ్టర్ అజ్నిల్ బిన్ బిడిన్ ముహమ్మద్ 285 కిలోలు ఎత్తి స్వర్ణం పతకం, పపువా న్యూగినియా వెయిట్ లిఫ్టర్ మోరియా బారు 273 కిలోలు ఎత్తి రజత పతకాన్ని దక్కించుకున్నాడు.
మరోవైపు కామన్ వెల్త్ గేమ్స్-2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన సంకేత్ మహదేవ్ సర్గర్ కు, కాంస్యం పతకం సాధించిన గురురాజా పూజారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. “సంకేత్ సర్గర్ చేత అసాధారణ ప్రయత్నం, అతను ప్రతిష్టాత్మక రజతం సాధించడం కామన్ వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి గొప్ప ప్రారంభం. అతనికి అభినందనలు మరియు అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ప్రధాని ట్వీట్ చేశారు. ఇక “పి.గురురాజా సాధించినందుకు అమితానందంగా ఉంది. కామన్ వెల్త్ గేమ్స్లో కాంస్యం సాధించినందుకు అతనికి అభినందనలు. అతను గొప్ప స్థితిస్థాపకత మరియు సంకల్పాన్ని ప్రదర్శించాడు. అతని క్రీడా ప్రయాణంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY