తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడు, సీనియర్ నేత రాజయ్య యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. కాగా రాజయ్య యాదవ్ తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెంట నడిచిన నేతగా ఆయనకు పార్టీలో, రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్ ఉద్యమ నేతగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయనతో పాటు దీక్ష చేసిన ఆరుగురు నాయకుల్లో రాజయ్య ఒకరు కావడం గమనార్హం. ఈ క్రమంలో కేసీఆర్తో కలిసి ఆయన జైలుకి కూడా వెళ్లారు. గతంలో షిప్ అండ్ గోట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ గా పనిచేసిన రాజయ్య.. అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పడం విశేషం.
అలాంటి రాజయ్య నేడు పార్టీని వీడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22 సంవత్సరాలపాటు పార్టీలో కొనసాగానని, కేసీఆర్తో సన్నిహితంగా మెలిగానని, ఇప్పుడు చాలా కష్టంగా పార్టీని వీడుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసమే తాను పార్టీని వీడాల్సి వస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని రాజయ్య వాపోయారు. తనయుడు కేటీఆర్ కోసం పార్టీ లోని అనేకమంది సీనియర్లను కేసీఆర్ పక్కన పెట్టేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్ఎస్ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, పదవుల కోసం తాను ఏనాడూ పాకులాడలేదని వెల్లడించారు. నాకు కాళ్లు మొక్కడం అలవాటు లేదు. ఏదైనా తప్పు చేశానని పార్టీ నుంచి తొలగించినా బాగుండేదని, కానీ ఏదీ జరగడం లేదని చెప్పారు. ఆత్మ గౌరవం లేనిచోట ఎవరూ ఉండరు. రేపో మాపో మరికొందరు పార్టీని వీడతారనన్న ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, కానీ ఆ పార్టీ బలహీనంగా ఉండడంతో బీజేపీ వైపే ఎక్కువ మంది చూస్తున్నారని అన్నారు. ఇక బీజేపీ నేతలు తనతో కూడా టచ్ లో ఉన్నారని రాజయ్య యాదవ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ