ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ తుది అంకానికి చేరువైంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరుగనుంది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ గెలిచేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అలాగే మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నమెంట్లో ఇప్పటివరకు మొత్తం 63 మ్యాచ్లు జరిగాయి. నేడు జరుగనున్న మ్యాచ్ 64వది కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో అందరి కళ్ళు అర్జెంటీనా స్టార్ ప్లేయర్ ‘లియోనెల్ మెస్సీ‘ మరియు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ‘ఎంబాపే’పైనే ఉన్నాయి. వీరి రాణింపు పైనే ఆయా జట్ల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం వీరిద్దరూ ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. మెస్సీ ఐదు గోల్స్ చేయగా.. అతడితో పాటు సమానంగా ఎంబాపే కూడా ఐదు గోల్స్తో టాప్ ప్లేస్లో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. దీంతో వరల్డ్ కప్లో ప్రతిష్టాత్మకంగా భావించే, అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడికి అందించే ‘గోల్డెన్ బూట్’ అవార్డ్ ఎవరు గెలుస్తారో అని ఫుట్బాల్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
లియోనాల్ మెస్సీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం, ఎందుకంటే?
అయితే లియోనాల్ మెస్సీకి నేడు జరుగనున్న ఫైనల్ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ ప్రపంచ కప్ తర్వాత మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అతనికి అర్జెంటీనా తరఫున ఇదే చివరి మ్యాచ్ కానుండటంతో ఫైనల్లో ఫ్రాన్స్పై గెలిచి కెరీర్ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉన్నాడు. కాగా అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్లో ఫైనల్ చేరుకోవడం మొత్తంగా ఇది ఆరోసారి కాగా.. అందులో మూడు సార్లు విజేతగా నిలవగా, మరో రెండు సార్లు రన్నరప్గా నిలిచింది. ఇక 2018 ప్రపంచ కప్ గెలుచుకున్న ఫ్రాన్స్ మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతోంది. నేటి మ్యాచ్లో గెలవడం ద్వారా వరుసగా రెండోసారి వరల్డ్ కప్ గెలవాలని ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. దీంతో సాకర్ అభిమానులకు మంచి పసందైన మ్యాచ్ చూసే అవకాశం లభించనుంది. కాగా నేటి రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇండియాలో స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 హెచ్డీ మరియు డీడీ స్పోర్ట్స్ ఛానెల్స్లో ప్రసారం కానుంది.
విజేతలకు అందజేయనున్న ప్రైజ్ మనీ
కాగా ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ నిర్వహణ ఖర్చు 200 బిలియన్ అమెరికన్ డాలర్లు. అలాగే ఫిఫా ప్రపంచ కప్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన విజేతలకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. ప్రపంచ కప్ విజేతకు $42 మిలియన్ (రూ.344 కోట్లు) ప్రైజ్ మనీని అందజేయనుండగా, రన్నరప్ జట్టుకు $30 మిలియన్ (రూ.245 కోట్లు) అందజేయనున్నారు. అదే సమయంలో మూడు స్థానంలో ఉన్న జట్టు $27 మిలియన్లు (రూ.220 కోట్లు) మరియు నాల్గవ స్థానంలో ఉన్న జట్టు $25 మిలియన్లు (రూ.204 కోట్లు) దక్కించుకోనున్నాయి. కాగా శనివారం రాత్రి మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మొరాకోపై క్రోయేషియా 2-1తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE