ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తునట్టు ప్రకటించారు. ముందుగా మూడు వ్యవసాయ బిల్లులకు (ద ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు-2020, ద ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు-2020, ద ఎసన్షియల్ కమోడిటీస్ (సవరణ) బిల్లు-2020) లోక్ సభ, రాజ్యసభలో ఆమోదించిన అనంతరం సెప్టెంబర్ 28, 2020న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.
ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి దాదాపు ఏడాది కావొస్తుంది. పలుమార్లు కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. రోజురోజుకు దేశవ్యాప్తంగా రైతులకు మద్ధతు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు రైతులకు శుభవార్త అందించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా తాజాగా ప్రధాని మోదీ ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, తన ఐదు దశాబ్దాల ప్రజాసేవలో రైతులు పడుతున్న కష్టాలను చూశానని, దేశం తనను ప్రధానమంత్రిని చేసినప్పుడు, రైతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చానని చెప్పారు. దేశంలోని చిన్న రైతులు వారి సవాళ్లను అధిగమించేలా విత్తనాలు, బీమా, మార్కెట్లు మరియు పొదుపుపై అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యమైన విత్తనాలతో పాటుగా యూరియా, సాయిల్ హెల్త్ కార్డు, మైక్రో ఇరిగేషన్ వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం రైతులకు అనుసంధానం చేసిందని చెప్పారు. ఫసల్ బీమా యోజన కూడా రైతులకు సహాయం చేసిందని, రైతులకు నష్టపరిహారంగా లక్ష కోట్లు ఇచ్చాం, బీమా, పెన్షన్ కూడా అందించామని అన్నారు. గ్రామీణ మార్కెట్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయబడడంతో పాటుగా కనీస మద్దతు ధర పెంచబడిందన్నారు.
“ఆ మార్గంలోనే మంచి ఉద్దేశ్యంతో వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాం. అయినప్పటికీ రైతులను ఒప్పించలేకపోయాం. చట్టాలపై రైతులకు అవగాహన కల్పించడానికి, వివరించడానికి కేంద్రం ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ, వారిలో ఒక వర్గం చట్టాలను వ్యతిరేకిస్తోంది. రైతులకు చట్టాలను వివరించేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. చట్టాలను సవరించడానికి కూడా సిద్దమయ్యాం. ఈ చట్టాల వ్యవహారం సుప్రీంకోర్టులో కూడా విచారణలో చేరింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం. రైతులంతా ఆందోళన విరమించి మీ ఇళ్లకు, మీ పొలాలకు తిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల కలలను సాకారం చేయడానికి మరింత కష్టపడి పని చేస్తానని హామీ ఇస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ