కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? శనివారం ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు పరిశీలిస్తే అదే ఉద్దేశంతో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారం సోనియా గాంధీ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ అని, ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇదని, సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. కాగా, భారత్ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్ ముగియనుందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సోనియా గాంధీ ఇంకా మాట్లాడుతూ.. ఇక 2004 మరియు 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తినిచ్చాయని, కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలకు చెందిన ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉండే కొంతమంది వ్యాపారవేత్తలకు బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని, తద్వారా దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని మండిపడ్డారు. ఇంకా బీజేపీ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, దీనిలో భాగంగా మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్గా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాల్సిందిగా నేతలకు, శ్రేణులకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాగా కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో దాదాపు 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో విపక్ష పార్టీలతో పొత్తులపై ఈ ప్లీనరీలో ఒక నిర్ణయానికి రానున్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ సారథ్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది. ఇక మొదటి రోజు జరిగిన ప్లీనరీలో, పార్టీ టాప్ కౌన్సిల్ సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించ రాదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నా విషయం తెలిసిందే. అలాగే సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించాలని కూడా కమిటీ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE