టీమిండియా కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై నయా రికార్డ్ సాధించాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 71 బంతుల్లో.. 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 85 పరుగులు సాధించి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికా గడ్డపై ఒక వన్డే మ్యాచ్లో అత్యధిక స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్గా తొలి స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ తర్వాతి స్థానంలో రాహుల్ ద్రవిడ్ (77 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. ఆ తర్వాత ఎంఎస్ ధోని (65 పరుగులు), సబా కరీమ్ (55) ఉన్నారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధవన్, లోకేష్ రాహుల్ శుభారంభం అందించారు. అయితే, వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి సౌతాఫ్రికా బౌలర్లపై బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు కేఎల్ రాహుల్ కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా నడిచింది. సెంచరీకి చేరువవుతున్న క్రమంలో 85 పరుగుల వద్ద పంత్ షంసీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు.
అయితే, కేఎల్ రాహుల్ (55), శిఖర్ ధవన్ (29), వెంకటేశ్ అయ్యర్ (22) శార్దూల్ ఠాకూర్ (40), రవిచంద్రన్ అశ్విన్ (25) అండతో భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఆడి డకౌట్గా వెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులు సాధించి ప్రత్యర్థికి సవాలు విసిరింది. మొదటి వన్డేలో ఓటమి పాలైన భారత్ సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక నెగ్గాలి. బ్యాటింగ్ లో సత్తా చాటి భారీ స్కోరు సాధించిన భారత్.. మ్యాచ్ గెలవాలంటే ఇప్పుడు బౌలర్లు కూడా రాణించాలి. బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న సౌతాఫ్రికాను మన బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF