ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు ఊరట లభించింది. మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో చిదంబరంకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ డిసెంబర్ 4, బుధవారం నాడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ ఆర్ భానుమతి, ఏఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్లతో కూడిన ధర్మాసనం చిదంబరం బెయిల్ పిటిషన్ ను విచారించి తీర్పు ఇచ్చారు. సాక్ష్యాల్ని ప్రభావితం చేసే ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని ఆదేశించారు. మీడియా సంస్థలతో మాట్లాడడం, బహిరంగ ప్రకటనలు చేయకూడదని ధర్మాసనం సూచించింది. కోర్టు అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లకూడదని, సాక్ష్యాల్ని ప్రభావితం చేయకూడదని షరతులు విధిస్తూ రూ.రెండు లక్షల పూచీకత్తుతో ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను నవంబర్ 15 న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా చిదంబరాన్ని ఆగస్టు 21 న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసి విచారణ అనంతరం రిమాండ్ మీద తీహార్ జైలుకి తరలించారు. ఈ కేసులో అక్టోబర్ 22 న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అక్టోబర్ 16న మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో బెయిల్ లభించినప్పటికీ ఆయన తీహార్ జైలులోనే విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఇప్పుడు ఈడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ లభించడంతో 106 రోజుల తర్వాత చిదంబరం జైలునుంచి బయటకు రానున్నారు.
[subscribe]