అక్టోబర్ 31, 2019 గురువారం నాడు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (యుటిలు) విభజించబడింది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం బుధవారం అర్ధరాత్రి నుండే అమల్లోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఇప్పుడు జమ్మూ కశ్మీర్ మరియు లద్ధాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి కీలక నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం, దాంతో పాటు జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019ను ప్రవేశపెట్టింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 144 వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31 న జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని భారత ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో భారతదేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య మరోసారి 28 కి పడిపోయింది, యుటిల సంఖ్య 9 కి పెరిగింది. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ దానికి పుదుచ్చేరి తరహాలో శాసనసభ ఉంటుంది మరియు శాసనసభ ఎన్నికలను నిర్వహిస్తారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 114 సీట్లు ఉండనునట్టు తెలుస్తుంది.
మొదటిసారిగా ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. దేశంలో ఇప్పటివరకూ కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చడం లేదా, రాష్ట్రాలను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం చేసేవారు. అయితే జమ్మూ కశ్మీర్ లో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భవిష్యత్తులో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక తిరిగి జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా కేంద్ర వ్యయ కార్యదర్శి గిరీష్ చంద్ర ముర్ము ఉంటారు. మరోవైపు, భారత మాజీ రక్షణ కార్యదర్శి రాధా కృష్ణ మాథుర్ లద్ధాఖ్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ నియమితులయ్యారు, వారిద్దరూ చేత గురువారం నాడు శ్రీనగర్, లేహ్ లలో వేర్వేరుగా జరిగే కార్యక్రమాల్లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిత్తల్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరో వైపు ఇప్పటివరకు జమ్మూ కశ్మీర్ లో అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
[subscribe]