నవంబర్ 2 శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రివర్గం భేటీ కాబోతుంది. రాష్టంలో ఆర్టీసీ కార్మికులు గత 27 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆర్టీసీ వ్యవహారంలో ప్రభుత్వం అతి కీలక నిర్ణయం తీసుకునే దిశగా రంగం సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అంశమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్న క్రమంలో ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని పూరిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది.
50 శాతం ఆర్టీసీ, 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేట్ బస్సుల పద్ధతిలో ఆర్టీసీ మూడు రకాలగా విభజించబోతున్నట్టు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మోటార్ వెహికల్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే ప్రైవేటు స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇవ్వవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించబోతుంది. ఆర్టీసీ అంశంతో పాటు, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ అంశంపై కూడ చర్చించే అవకాశం ఉంది.
[subscribe]