ముంబయి నగరంలో మల్టీప్లెక్స్లు, షాపులు, రెస్టారెంట్లు మరియు మాల్లను 24 గంటలూ తెరచి ఉంచాలనే ప్రతిపాదనను జనవరి 22, బుధవారం నాడు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. జనవరి 27వ తేదీ నుంచి ముంబయి 24×7 విధానం అమల్లోకి రానుంది. కేబినెట్ సమావేశం అనంతరం పర్యాటక శాఖ మంత్రి, సీఎం ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే మాట్లాడుతూ, ఈ నిర్ణయం వలన ఆదాయంతో పాటుగా మరిన్ని ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుందని చెప్పారు. అయితే, రాత్రిపూట షాపులు, మాల్స్, రెస్టారెంట్లు తెరిచి ఉంచడం అనేది తప్పనిసరి కాదని, ఎవరైతే వ్యాపారం జరగాలని కోరుకుంటారో వారు మాత్రమే తెరుచుకోవచ్చని ఆదిత్య థాకరే తెలిపారు.
అలాగే బార్లు, పబ్బులు, మద్యం షాపులు మరియు డిస్కోథెక్లకు ఈ నిర్ణయం వర్తించదని చెప్పారు. ఈ నిర్ణయంలో భాగంగా తొలిదశలో వాణిజ్య ప్రాంతాల్లోని షాప్స్, రెస్టారెంట్లు, మాల్స్లోని థియేటర్లు, మిల్ కాంపౌండ్స్కు అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే నారీమన్ పాయింట్, బాంద్రా- కుర్లా కాంప్లెక్స్ లలోని ఫుడ్ ట్రక్స్కు కూడా అనుమతిస్తామని చెప్పారు. ఎవరైనా ఈ విధానం యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై జీవితకాలం నిషేధం విధిస్తామని ఆదిత్య థాకరే హెచ్చరించారు.
[subscribe]