ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టేందుకు రూపొందించిన విద్యా చట్టం సవరణ బిల్లుకు ఏపీ శాసన సభ జనవరి 23, గురువారం నాడు ఆమోదం తెలిపింది. విద్యా చట్టం సవరణ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదించగా, శాసన మండలిలో సవరణలును ప్రతిపాదిస్తూ తిరిగి అసెంబ్లీకి పంపారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై మరోసారి చర్చించి శాసన మండలి చేసిన సవరణలును తిరస్కరిస్తూ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ప్రతి పేదవిద్యార్థి కోసం రైట్ టు ఇంగ్లీష్ విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రాథమిక దశ నుంచే విద్యార్థులు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే, ఉన్నత చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు సాధిస్తారని అన్నారు.
పేదవిద్యార్థులకు మంచి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంటే, ఇంగ్లీష్ మీడియం బిల్లును కౌన్సిల్లో టీడీపీ అడ్డుకుందని విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ ఈ బిల్లును మండలికి పంపుతామని, అసెంబ్లీలో ఆమోదం పొందాక ఈసారి మండలిలో అడ్డుకున్నా చట్టంగా మారుతుందని చెప్పారు. అలాగే విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్ను దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్ నెలలో అందిస్తామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
[subscribe]