ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు శాసన మండలిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. అలాగే ఈ సమావేశానికి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం సుమారు గంట పాటు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏవిధంగా ముందుకుకెళ్లాలనే దానిపై వారితో సీఎం వైఎస్ జగన్ చర్చించారు.
శాసనమండలి నిర్ణయంపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే హైకోర్టులో రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నియమించుకున్న సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీతో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు సీఎంతో భేటీ అనంతరం వైసీపీ నాయకులు మళ్ళీ ప్రత్యేకంగా భేటీ అయ్యి శాసన మండలి నిర్ణయంపై చర్చిస్తున్నారు.
[subscribe]