ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో వీరిద్దరి మధ్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడ పాల్గొన్నారు. ఈ సమావేశంలో శరద్ పవార్ ప్రధానికి ఒక లేఖను అందజేశారు. మహారాష్ట్రలో రైతుల సమస్యలపై మోదీతో చర్చించారు. దీనితో పాటు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు, ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం కూడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో రైతుల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర రాజకీయాలపై చర్చించలేదని, రైతుల సమస్యలపైనే మాట్లాడినట్టు తెలిపారు. మహారాష్ట్రలో రైతులకు కేంద్రం తక్షణమే సాయం ప్రకటించాలని, రుణాలను మాఫీ చేయాలని కోరానని చెప్పారు. మరోవైపు రేపు మధ్యాహ్నం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత ఇస్తామని శివసేన నాయకులు చెబుతున్నారు. మోదీ-పవార్ భేటీపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆ భేటీలో తప్పేమి లేదని, ఇద్దరు పెద్ద నాయకులు కలిస్తే ఎలా పడితే అలా ఊహించుకుంటున్నారని అన్నారు. రేపు మధ్యాహ్నం లోపు ప్రభుత్వ ఏర్పాటుపై తేలిపోతుందని, డిసెంబరు నెలకు ముందే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుందని తెలిపారు.
[subscribe]