ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘నమామి గంగే మిషన్’ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ లో 6 మెగా అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అలాగే ‘గంగా అవలోకన్ మ్యూజియమ్’ ను కూడా పీఎం మోదీ ప్రారంభించారు. గంగా నదికి సంబంధించిన విశేషాలతో కూడిన మొట్టమొదటిదైనా ఈ మ్యూజియమ్ హరిద్వార్ లో ఏర్పాటు చేశారు. అలాగే “రోయింగ్ డౌన్ ద గంగా” పేరుతో వచ్చిన ఒక పుస్తకాన్ని, జల్ జీవన్ మిషన్ అధికారిక చిహ్నాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశంలో గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి నల్లా నీటిని అందించాలన్నదే ‘జల్ జీవన్ మిషన్’ ధ్యేయం అని స్పష్టం చేశారు. ఈ మిషన్ కు చెందిన కొత్త లోగో ప్రతి ఒక్క నీటి చుక్కను ఆదా చేయవలసిన అవసరం ఉందనే ప్రేరణను ఇస్తుందని చెప్పారు.
గంగానది ఉత్తరాఖండ్ లోని తన మూల స్థానం మొదలుకొని, పశ్చిమ బెంగాల్ లో సముద్రంలో కలిసే వరకు దేశ జనాభాలో దాదాపుగా 50 శాతం మంది ప్రాణాలను నిలబెట్టడంలో ఒక ప్రముఖ పాత్రను పోషిస్తున్న కారణంగా ఈ నదికి గొప్ప ప్రాముఖ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. నమామీ గంగే మిషన్ అతిపెద్దదైన సమీకృత నదీ పరిరక్షణ మిషన్ అని మోదీ అభివర్ణించారు. ఈ మిషన్ గంగా నదిని పరిశుభ్రపరచాలన్న ఒక లక్ష్యానికి అదనంగా, ఆ నదిని సంపూర్ణంగా మెరుగు పరచాలన్న అంశంపైన కూడా దృష్టి సారిస్తుందని వివరించారు. ఈ సరికొత్త ఆలోచన సరళి, ఈ నూతన దృక్పథం గంగా నదికి జవజీవాలను మళ్ళీ ప్రసాదించిందని అన్నారు. పాత పద్ధతులనే అనుసరిస్తూ వెళ్ళి ఉంటే గనుక పరిస్థితి ప్రస్తుతం మరింత అధ్వాన్నంగా మారేదని అన్నారు. ఇదివరకు అవలంభించిన పద్ధతులలో ముందుచూపు, ప్రజల భాగస్వామ్యం లోపించాయని చెప్పారు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించడానికి చతుర్ముఖ వ్యూహంతో ముందడుగు వేసిందని పేర్కొంటూ, ఆ నాలుగు వ్యూహాలను గురించి వివరించారు.
వాటిలో మొదటిదిగా గంగానదిలోకి వ్యర్థ జలాలు పారకుండా అడ్డుకోవడానికిగాను మురుగుశుద్ధి ప్లాంటులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, రెండోది ఆ ఎస్టిపి లను రాబోయే 10-15 ఏళ్ళ కాలంలో వచ్చే అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించడం జరుగుతుందన్నారు. ఇక మూడోదిగా గంగా నది తీర ప్రాంతాలలోని సుమారు వంద పెద్ద పట్టణాలు/నగరాలను, అయిదు వేల పల్లెలను ఆరు బయలు ప్రాంతాలలో మలమూత్రాదుల విసర్జన (ఒడిఎఫ్) అభ్యాసం బారి నుండి విముక్తం చేయడం జరుగుతుందన్నారు. అలాగే నాలుగో వ్యూహంలో భాగంగా గంగానది ఉప నదులలోకి ప్రవహిస్తున్న కలుషిత జలాలను ఆపేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధాని అన్నారు. నమామి గంగే లో భాగంగా 30,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి కావడం గానీ, లేదా ఆయా పనులు పురోగతిలో ఉండడం గానీ జరుగుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో ఉత్తరాఖండ్ మురుగుశుద్ధి సామర్ధ్యం గడచిన ఆరు సంవత్సరాలలో నాలుగింతలు పెరిగిందని పీఎం మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu