ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో లాక్డౌన్ పై స్పష్టత నిచ్చారు. నేడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని మనం లాక్డౌన్ నుంచి కాపాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ను చివరి అస్త్రంగానే పరిగణించాలని కోరారు. మైక్రో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించి లాక్డౌన్ ను తప్పించడానికే మనమంతా వీలైనంతగా కృషి చేయాలని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. కఠిన పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీస్ బలగాలు, పారిశుధ్య కార్మికులుకు ధన్యవాదాలు తెలిపారు. మనమంతా సంసిద్ధత, మనోధైర్యం, పట్టుదలతో సామూహికంగానే ఈ కరోనా పరిస్థితిని అధిగమించగలమని పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కోసం పెరుగుతున్న డిమాండును తీర్చేవిధంగా, వేగంగా ఒక అవగాహనతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పారిశ్రామిక వినియోగం నుంచి ఆక్సిజన్ ను ఆస్పత్రులకు మళ్లిస్తున్నామని, ఆక్సిజన్ సరఫరా రైళ్లు నడపడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని తెలిపారు.
మే 1వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్:
మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారని, ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు లభించేది భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ యే అని ప్రధాని చెప్పారు. స్థానికంగా తయారుచేసిన రెండు రకాల కరోనా వ్యాక్సిన్ లతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు 12 కోట్ల వ్యాక్సిన్ డోసులకు పైగా పంపిణీ చేసినట్టు చెప్పారు. ఇక మే 1వ తేదీ తర్వాత దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్ డోసులలో సగం వివిధ రాష్ట్రాలకు, ఆస్పత్రులకు నేరుగా సరఫరా అవుతాయని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయం వలన నగరాల్లో వర్క్ ఫోర్స్ కి వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చినట్టు అవుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లోని కార్మికులు ఎక్కడున్నవారు అక్కడే ఉండేలా ప్రభుత్వాలు వారిలో విశ్వాసం కల్పించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మారి తొలిదశలో ఎదుర్కొన్న సవాళ్లతో పోలిస్తే, ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎదుర్కునే స్థాయిలో మనకు మరింత మెరుగైన పరిజ్ఞానం, వనరులు అందుబాటులో ఉన్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో వచ్చే బలంతో రెండో వేవ్ కరోనా మహమ్మారిని కూడా ఓడించగలమని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం అందించాలని, ముఖ్యంగా దేశంలో యువతరం తమతమ ప్రాంతాల్లోని ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో సహకారం అందించి, అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇలా చేస్తే కంటైన్మెంట్ జోన్స్, కర్ఫ్యూలు, లాక్డౌన్ లేకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. తమ ఇళ్లలోని పెద్దలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా పిల్లలే చూసుకోవాలని, అందుకు తగిన వాతావరణం కల్పించాలని ప్రధాని మోదీ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ