తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో చేపడుతున్నామని మంగళవారం నాడు ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
“అందరికీ నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమలో 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో మన కరోనా క్రైసిస్ ఛారిటీ ఒక కార్యక్రమం తలపెట్టింది. ఈ గురువారం నుంచి ఓ నెల రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుంది. 45 ఏళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, అలాగే సినీ జర్నలిస్టులు, మీ అసోసియేషన్స్ లేదా మీ యూనియన్స్ లో మీ పేరు నమోదు చేసుకోండి. మీతో పాటు, మీ జీవిత భాగస్వామికి 45ఏళ్లు దాటితే వారికి కూడా మీతో పాటు ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా ఉచితం. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజూ కొందరికి అపోలో హాస్పిటల్ లో తగిన వసతులతో వ్యాక్సిన్ ఇస్తారు. అలాగే మూడునెలల పాటు అపోలో 24/7 ద్వారా ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చు. మందులు కూడా రాయితీకి లభించే వెసులుబాటు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి లభిస్తుంది. కరోనా నుంచి మన పరిశ్రమను మనం కాపాడుకుందాం. ప్లీజ్ దయ చేసి ముందుకు రండి, వ్యాక్సిన్ వేయించుకోండి. సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి” అని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
ముందుగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గతఏడాది లాక్డౌన్ విధించిన సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి చైర్మన్ గా కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) పేరుతో ప్రత్యేక చారిటీ కమిటీని ఏర్పాటు చేశారు. చిత్ర పరిశ్రమలోని పలువురు ఈ కమిటీకి విరాళాలు అందజేశారు. లాక్డౌన్లో సమయంలో సీసీసీ ద్వారా పలు సార్లు కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ క్రమంలోనే సీసీసీ ద్వారా ఇప్పుడు సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచిత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ