హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ప్రకటించారు. జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్ చాన్స్లర్ ఆచార్య మురళీధరశర్మ మీడియాతో మాట్లాడుతూ, హనుమంతుని జన్మస్థలానికి సంబంధించిన పలు ఆధారాలను వెల్లడించారు. హనుమంతుని జన్మస్థానంపై నిరూపించేందుకు సంకల్పం తీసుకున్నామని, నాలుగు నెలల పాటు తమ కమిటీ అన్వేషణ కొనసాగిందని మురళీధర శర్మ పేర్కొన్నారు. శాసన, భౌగోళిక, పౌరాణిక, వాజ్ఞ్మయప్రమాణాలతో ఆధారాలు సేకరించామని తెలిపారు.
వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని, వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు. త్రేతాయుగంలో వేంకటాచలాన్ని అంజనాద్రిగా పిలిచారని మురళీధరశర్మ చెప్పారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని పేర్కొన్నారు. సూర్యబింబం కోసం వేంకటగిరి నుంచే హనుమంతుడు ఎగిరాడు, అలాగే 12 పురాణాలు హనుమంతుడు తిరుమల కొండల్లో పుట్టాడని స్పష్టం చేస్తున్నాయని మురళీధర శర్మ వెల్లడించారు. అన్నమయ్య కీర్తనల్లో కూడా వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని చెప్పారు. కర్ణాటకలోని హంపి హనుమంతుడి జన్మస్థలం కాదని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు.
ముందుగా హనుమంతుడి జన్మస్థానంపై అన్వేషణకు కోసం టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డా.ఆకెళ్ల విభీషణశర్మ కన్వీనర్గా వ్యవహరించారు. ఈ కమిటీలో ఆచార్య మురళీధర శర్మతో పాటుగా ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ విజయ్కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై, లోతైన పరిశోధన చేసిన అనంతరం హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడు అనేందుకు బలమైన ఆధారాలను సేకరించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ