దేశంలో ఇప్పటికే 55 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు ఆరోగ్య మంత్రులతో సెప్టెంబర్ 23, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు వైద్యం అందుతున్న తీరు, తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
దేశంలోని ప్రస్తుతమున్న యాక్టివ్ కేసులలో 63% కంటే ఎక్కువగా ఈ ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఈ రాష్ట్రాల్లో కరోనా చికిత్స, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 23 న ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు:
- మహారాష్ట్ర
- ఆంధ్రప్రదేశ్
- కర్ణాటక
- ఉత్తరప్రదేశ్
- తమిళనాడు
- పంజాబ్
- ఢిల్లీ
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu