ఐజీఎస్టీ కన్వీనర్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన ఈ రోజు ఐజీఎస్టీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు బీఆర్కే భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన ఐజీఎస్టీ మొత్తం 2641 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. వచ్చె నెల ఐదో తేదీన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశానికి ముందే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఐజీఎస్టీ మొత్తాన్ని చెల్లించేలా సిఫార్సు చేయాలని ఐజీఎస్టీ గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీని మంత్రి హరీశ్ రావు కోరారు. కోవిడ్ సమస్యలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఈ నిధులు వస్తే చాలా ఊరట కలుగుతుందని చెప్పారు.
వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే మూడు నెలలు ఆగాల్సి వస్తుంది కాబట్టి వెంటనే ఐజీఎస్టీ నిధులు రాష్ట్రాలకు అందేలా సిఫారసు చేయాలని మంత్రి సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కన్వీనర్ సుశీల్ కుమార్ మోడీ అక్టోబర్ 1 వ తేదీన తిరిగి మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. 2018 నుంచి తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 16 రాష్ట్రాల కు రూ.25058 కోట్లు ఐజీఎస్టీ నిధులు రావాల్సి ఉంది. దీంతో ఈ సమావేశంలో ఐజీఎస్టీ సెటిల్ మెంట్ పైనే చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu