జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల్లో వైద్యశాఖ అధికారులు పల్స్పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు రాష్ట్రపతి భవన్లో కొద్దిమంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ముందుగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 17 నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కావడంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 31 కి వాయిదా వేశారు. మూడు రోజుల పాటుగా జరిగే ఈ పల్స్ పోలియో కార్యక్రమం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపడతారు. కాగా దగ్గు, జలుబు, జ్వరం ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ లక్షణాలు తగ్గాకా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు.
పోలియోమైలిటిస్ అనే వ్యాధిని నిర్ములించడానికి 1995వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ చిన్నారులను పోలియో కేంద్రాల వద్దకు తీసుకెళ్లి చుక్కలు వేయించాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అలాగే కరోనా పరిస్థితుల దృష్ట్యా పల్స్ పోలియో కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, ఫేస్ మాస్క్లు ధరించడం, హ్యాండ్వాషింగ్ వంటి నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ