ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా శని, ఆదివారాలతో కలుపుకుని సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు 18 రోజుల పాటుగా సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎనిమిది రోజులు ముందుగానే రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం నాడు ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు-2020, ది బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫైనాన్సియల్ కాంట్రాక్ట్స్ బిల్లు-2020, జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ బిల్లు-2020, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్లు-2020 లకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. పది రోజుల్లో సభలో మొత్తం 25 బిల్లులకు ఆమోదం తెలపగా, 6 బిల్లులు ప్రవేశపెట్టబడ్డాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
మరోవైపు వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభ ఎంపీల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ మహాత్మా గాంధీ విగ్రహం నుండి ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ చేశారు. అలాగే ప్రతిపక్షాల ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసి, వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై సంతకం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పలువురు ఎంపీలు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu