ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఉదయం ప్రకటించారు. ఆగస్టు 3 నుంచి 5 తేదీల్లో ఎంపీసీ సమావేశమై స్థూల ఆర్థిక పరిస్థితిని, దాని దృక్పథాన్ని సమీక్షించింది. ఈ నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమల్లోకి వచ్చేలా పాలసీ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.4 శాతానికి పెంచాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. మూడు నెలల్లోనే వరుసగా మూడోసారి రెపో రేటు పెంచారు. మే నెలలోనే రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో 4.40 శాతానికి చేరుకోగా, జూన్ 8న 50 బేసిస్ పాయింట్లు పెరగడంతో 4.90 శాతానికి, తాజాగా మరో 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో రెపో రేటు 5.40 శాతానికి పెరిగింది. తాజా పెంపుతో ప్రస్తుతమున్న వడ్డీ రేట్లను బ్యాంకులు కూడా పెంచే అవకాశం ఉండడంతో, హోమ్, పర్సనల్, వెహికల్ లోన్ తీసుకున్న వినియోగదారులకు, తీసుకునే వారికీ ఈఎంఐ పెరిగే అవకాశముంది.
అలాగే 50 బేసిస్ పాయింట్లు పెంపుతో స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం (ఎస్డీఎఫ్) రేటు 5.15 శాతానికి మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు మరియు బ్యాంక్ రేటు 5.65 శాతానికి సర్దుబాటు చేయబడిందని చెప్పారు. వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి, అనుకూలత ఉపసంహరణపై దృష్టి పెట్టాలని ఎంపీసీ నిర్ణయించిందన్నారు. 2022-23కి సంబంధించిన వాస్తవ జీడీపీ వృద్ధి అంచనా 7.2 శాతం వద్ద ఉందన్నారు. Q1 వద్ద 16.2 శాతం, Q2 వద్ద 6.2 శాతం, Q3 వద్ద 4.1 శాతం, మరియు Q4లో 4.0 శాతంగా అంచనా వేస్తున్నామన్నారు. ఇక 2023-24 Q1లో వాస్తవ జీడీపీ వృద్ధి 6.7 శాతంగా అంచనా వేయబడిందని తెలిపారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం 2022-23లో 6.7 శాతంగా అంచనా వేయబడిందని (Q2 7.1 శాతంగా ఉంది, Q3 వద్ద 6.4 శాతం, Q4లో 5.8 శాతం) చెప్పారు. 2023-24 Q1కి సీపీఐ ద్రవ్యోల్బణం 5.0 శాతంగా అంచనా వేయబడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY