కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభనపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. దాదాపు మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా అనేక మలుపులు తిరిగిన కర్ణాటక రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్తో పలుమార్లు సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు డీకే కోరిన శాఖలు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా చేసేందుకు మార్గం సుగమం అయింది. ఈ పరిణామాల క్రమంలో నేడు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అలాగే డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరియు కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా.. ఈ వేడుకకు రాష్ట్రంలోని విపక్ష నేతలందరినీ ఆహ్వానిస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఈరోజు సాయంత్రం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను లాంఛనంగా సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. మరోవైపు పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తొలి రెండేళ్లు సిద్ధరామయ్య సీఎం పదవిలో కొనసాగనుండగా.. చివరి మూడేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE