ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్గా ఎస్.ఎన్.శ్రీవాస్తవ నియమించబడ్డారు. ఈ నియామకాన్ని కేంద్ర హోంశాఖ అధికారిక వర్గాలు దృవీకరించాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అమూల్య పట్నాయక్ ఫిబ్రవరి 29, శనివారం నాడు పదవీవిరమణ పొందనున్నారు. గత కొన్ని రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని ఒక నెలపాటు పొడగించారు. ఇక ఆయన స్థానంలో ఆదివారం నాడు శ్రీవాస్తవ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈశాన్య ఢిల్లీలో గత మూడురోజులుగా జరిగిన ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్గా శ్రీవాస్తవ బాధ్యతలు తీసుకోనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనలపై నమోదైన కేసులన్నింటినీ విచారణ నిమిత్తం సిట్ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక సిట్ బృందానికి డీసీపీ రాజేశ్ దేవ్, మరో బృందానికి క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ సీపీ బీకే సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధించి హత్య, అల్లర్లు, కాల్పులు జరపడం, ప్రజా, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వంటి ఆరోపణలపై పోలీసులు ఇప్పటికీ 48 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. అలాగే 130 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
[subscribe]