భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణలో ప్రతిపాదిత మార్పులకు సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించింది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లలో ఆరేళ్లు మరియు బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్లపాటు వరుసగా పదవీకాలం కలిగి ఉండవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ముందుగా 2019లో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు మరియు బీసీసీఐ ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి మధ్య తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్ షరతును తొలగిస్తూ బీసీసీఐ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఈ అంశంపై బీసీసీఐ రాజ్యాంగ సవరణకై ఆమోదం కోసం 2020లో సుప్రీంకోర్టులో బీసీసీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ పిటిషన్ పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం బుధవారం ఉదయం విచారణ చేపట్టి, బీసీసీఐ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది. సవరణ యొక్క అసలు లక్ష్యాన్ని బీసీసీఐ వక్రీకరించదని భావిస్తున్నామని, ప్రతిపాదిత సవరణను అంగీకరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
ఇప్పటివరకు జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం బీసీసీఐ లేదా రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లలో ఏ పదవిలోనైనా వరుసగా ఆరేళ్లకు మించి కొనసాగకూడదు. మూడేళ్ల కూలింగ్ పీరియడ్ పాటించిన తర్వాతనే మళ్లీ వాటిల్లో పదవీని చేపట్టాల్సి ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఈ నిబంధన మారనుంది. దీంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరి జై షా తమ పదవుల్లో 2వ విడతగా మరో 3 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. తాజా తీర్పు ప్రకారం వరుసగా రాష్ట్ర అసోసియేషన్ల పదవుల్లో 6 ఆరేళ్లు మరియు బీసీసీఐ పదవుల్లో ఆరేళ్లు కొనసాగవచ్చు. బీసీసీఐలో గంగూలీ, జై షాల మొదటి మూడేళ్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. దీంతో రెండు విడతలో కూడా పదవుల్లో కొనసాగేందుకు వారికీ మార్గం సుగమం అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY