గురువారం చెన్నై వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 31,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కోసం ప్రధాని రాష్ట్రానికి విచ్చేశారు. పర్యటనలో భాగంగా చెన్నైలో జరిగిన ఒక బహిరంగ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, ప్రధాని మోదీ ముందు తమిళ వాదాన్ని వినిపిస్తూ.. కేంద్రం తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మోదీ తమిళనాడులో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ క్రమంలో సీఎం స్టాలిన్ ప్రధానికి తమ రాష్ట్ర డిమాండ్లను వినిపించారు. సభలో స్టాలిన్ మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధి, అద్భుతమైన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పెద్ద సంఖ్యలో సంస్థలు మరియు అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరుల పరంగా తమిళనాడు అగ్రగామి రాష్ట్రమని పేర్కొన్నారు. మన రాష్ట్రం ఆర్థిక మరియు ఇతర సంబంధిత అంశాల్లోనే కాకుండా సామాజిక న్యాయం, సమానత్వం మరియు మహిళా సాధికారతలో కూడా అగ్రగామిగా ఉంది. దీన్నే ద్రవిడ మోడల్ అని పిలుస్తాం, అని స్టాలిన్ అన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామని, అలాగే రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్రం నుంచి తమిళనాడు రాష్ట్రానికి తగినన్ని నిధులు రావడం లేదని ప్రధాని ముందు అసహనం వ్యక్తం చేశారు.
హిందీని కాకుండా తమిళ భాషను అధికారిక భాషగా గుర్తించాలంటూ ప్రధానిని కోరారు. అలాగే జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని, నీట్ పరీక్షను తాము వ్యతిరేకిస్తున్నామని, ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశ పెట్టామని వెల్లడించారు. ఇక జాతీయ భాష హిందీ వలే మద్రాస్ హైకోర్టులో తమిళ్ను అధికార భాషగా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రానికి ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులను కేంద్రం త్వరగా విడుదల చేయాలని కోరారు. తమిళ మత్స్యకారులు చేపలు పట్టేందుకు సాయంగా శ్రీలంక నుంచి ‘కచ్చతీవు’ ద్వీపాన్ని తిరిగి పొందాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ