అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారికీ ఆగ్రాలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలను, సాంస్కతిక కార్యక్రమాలను ట్రంప్ కొద్దిసేపు ఆసక్తిగా తిలకించారు. ముందుగా ట్రంప్ ఆగ్రాకు చేరుకుంటున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా 25 వేల మంది విద్యార్థులు భారత్-అమెరికా జెండాలతో స్వాగతం పలికారు. ట్రంప్ తాజ్ మహల్ సందర్శనకు రావడంతో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
డోనాల్డ్ ట్రంప్ తన సతీమణీ మెలానియాతో ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ను సందర్శించారు. తాజ్ మహల్ వద్దకు చేరుకున్న ఆయన సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్ వద్ద నిల్చుని ఫొటోలకు పోజిచ్చారు. తాజ్ మహల్ పరిసరాల్లో దాదాపు 45 నిమిషాల పాటు వారు కలియ తిరిగారు. ట్రంప్ కోసం ప్రత్యేకంగా నియమించబడిన గైడ్ తాజ్ మహల్ విశేషాలను వారికీ వివరించారు. ఆ తర్వాత ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేడ్ కుశ్నర్ కూడా తాజ్ మహల్ ను సందర్శించారు.
[subscribe]