ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటిటెస్టులో భారీ స్కోర్ సాధించిన భారత జట్టు పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 86/1 తో ఆట కొనసాగించి, మరో 407 పరుగులు జత చేసిన భారత జట్టు తోలి ఇన్నింగ్స్ ను 493/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన కెరీర్ లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. 37 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడాడు. 29 ఫోర్లు, 8 సిక్సర్లతో క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తూ 243 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక మిగిలిన భారత్ బ్యాట్స్ మెన్ లలో అజింక్య రహానే 86 పరుగులు చేసి ఔట్ అవ్వగా, రవీంద్ర జడేజా 60 పరుగులతో నాటౌట్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ పేస్ బౌలర్ అబు జయేద్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఓవర్ నైట్ స్కోర్ 86/1 తో రెండో ఆట ప్రారంభించిన భారత జట్టు కొద్దిసేపటికే చటేశ్వర్ పుజారా వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన పుజారాను జట్టు స్కోరు 105 వద్ద అబు జయేద్ ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం పరుగులు లేమి చేయకుండా అబు జయేద్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యాడు. విరాట్ తరువాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే తో కలిసి మయాంక్ అగర్వాల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. బంగ్లా బౌలర్లను వీరిద్దరూ సమర్థంగా ఎదుర్కోవడంతో లంచ్ సమయానికి భారత్ 188/3 పరుగులు చేసింది. అజింక్య రహానె 86 పరుగుల చేసి వెనుదిరగగా, రవీంద్ర జడేజాతో కలిసి మయాంక్ అగర్వాల్ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జట్టు స్కోరు 432 వద్ద భారీ షాట్కు ప్రయత్నించిన మయాంక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 12 పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరగగా, ఉమేశ్ యాదవ్(25), రవీంద్ర జడేజా (60) పరుగులతో క్రీజులో ఉన్నారు. 493/6 వద్ద డిక్లేర్ చేయడంతో భారత జట్టు 343 పరుగుల ఆధిక్యంలో ఉంది.