గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నవంబర్ 15, శుక్రవారం నాడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. తనపై కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తనను కించపరిచేలా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా దిగజారి ప్రవర్తిస్తున్నారని, దీని వెనుకున్న సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు వంశీ తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ నాశనం చేయడమే లక్ష్యంగా, కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని కించపరుస్తున్నారని, అటువంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని చెప్పారు.
మరో వైపు ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 14, గురువారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై ఆయన తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలోనే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో షోకాజ్ నోటీసు ద్వారా వంశీ వివరణ కోరనున్నారు. కొన్ని రోజుల క్రితమే టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ, గురువారం నాడు వైసీపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కలిసి నడుస్తానని చెప్పారు. త్వరలోనే వైసీపీలో చేరనున్నట్లు కూడ ప్రకటించారు.
[subscribe]