భారత్, వెస్టిండీస్ మధ్య ప్రావిడెన్స్ వేదికగా మొదలైన తోలి వన్డే వర్షం కారణంగా పూర్తిగా జరగకుండానే రద్దయింది. మ్యాచ్ ప్రారంభం కాకముందే భారీ వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ సరిగా లేకపోవడం వలన ఆలస్యంగా టాస్ వేశారు. మ్యాచ్ నిర్ణిత సమయానికి కాకుండా రెండు గంటలు ఆలస్యం కావడంతో మొదటగా ఇన్నింగ్స్ ను 43 ఓవర్లకు కుదించారు. 13 ఓవర్లపాటు మ్యాచ్ కొనసాగినా, వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. 13 ఓవర్ల తరువాత వర్షం తగ్గే సూచనలు కనిపించక పోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తునట్టు అంఫైర్స్ ప్రకటించారు.
ముందుగా 43 ఓవర్లతో నిర్ణయించిన ఇన్నింగ్స్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓపెనింగ్ వచ్చిన క్రిస్ గేల్, లూయిస్ భారత బౌలర్లను ఎదురుకోలేక ఇబ్బంది పడుతూ మొదట 5 ఓవర్లకి కేవలం 8 పరుగులు చేసారు. ఆరో ఓవర్లో మళ్ళీ వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ను మరోసారి 34 ఓవర్లకి కుదించారు, కుల్ దీప్ బౌలింగ్ లో క్రిస్ గేల్ (4) బౌల్డ్ అయి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన షై హోప్ తో కలిసి లూయిస్ దూకుడుగా ఆడుతుండగా వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. లూయిస్ 40 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు 13 ఓవర్లకి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. 13 ఓవర్ల తరువాత వర్షం వలన ఆగిపోయిన మ్యాచ్ ను రద్దు చేస్తునట్టు అంఫైర్స్ ప్రకటించారు. ఇక రెండవ వన్డే ఈ నెల 11న జరగనుంది.