ఇటీవల జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్లో పరాజయం తరువాత క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కొద్దీ రోజుల వ్యవధిలోనే మళ్ళీ వెస్టిండీస్ టూర్తో భారత ఆటగాళ్లు మైదానం లోకి దిగనున్నారు. ఆగస్ట్ 3 నుంచి మొదలయ్యే ఈ టూర్ లో వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు భారత్ ఆడనుంది. వరల్డ్ కప్ కి ఆటగాళ్లను ఎంపిక చేసిన ఎమ్మెస్కె ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యే ఈసిరీస్ కి జట్టును ఎంపిక చేయనుంది. సెలక్షన్ కమిటీ ఈ నెల 21 ముంబయి లో సమావేశమయ్యి జట్టును ఎంపిక చేయనుంది.
ప్రపంచకప్ లో పరాజయం తరువాత భారత్ క్రికెట్ జట్టులో ఏమైనా మార్పులు ఉంటాయేమోనని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని ఎంపిక పై సెలెక్టర్లు తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. ధోని రిటైర్మెంట్ పై వార్తలు రావడం కొనసాగుతుండడంతో, సెలెక్టర్లు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనే ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలనీ భావించారు, ప్రపంచ కప్ తరువాత విశ్రాంతి తీసుకుంటాడనుకున్న విరాట్ కోహ్లీ సైతం వెస్టిండీస్ టూర్ కి అందుబాటులో ఉంటానని చెప్పడంతో సెలక్షన్ కమిటీ పై అందరూ దృష్టి సారించారు. జట్టులో ఎవరికీ చోటు దక్కుతుంది, ఎలాంటి మార్పులు ఉంటాయో అనే ఉత్కంఠ కి మరో రెండు రోజుల్లో తెరపడనుంది.