భారత నంబర్వన్ మహిళా చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తన కెరీర్లోనే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 28, శనివారం నాడు ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ లో మహిళల విభాగంలో హంపి విశ్వ విజేతగా నిలిచింది. భారత్ నుంచి విశ్వ విజేతగా నిలిచిన తొలి మహిళా చెస్ క్రీడాకారిణిగా హంపి కొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ గెలుచుకోవడం పట్ల కోనేరు హంపి సంతోషం వ్యక్తం చేసింది. భారత్ చెస్ మహిళ విభాగంలో తోలి ప్రపంచ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. ఈ టోర్నీలో నిర్ణీత 12 రౌండ్లు ముగిసే సమయానికి హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా నిలిచారు. దీంతో టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ లను నిర్ణయించగా హంపి, లీ టింగ్జి మొదటి రెండు స్థానాల్లో నిలువగా, అతాలిక్ ఎకతెరీనా మూడో స్థానంలో నిలిచింది.
మూడో స్థానం దక్కించుకున్న అతాలిక్కు కాంస్య పతాకాన్ని నిర్ణయించగా, హంపి, లీ టింగ్జి మధ్య ప్రపంచ చాంపియన్ టైటిల్ కోసం ప్లే ఆఫ్ నిర్వహించారు. ప్లే ఆఫ్ కింద రెండు బ్లిట్జ్ గేమ్లు నిర్వహించగా, తొలి బ్లిట్జ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోగా, రెండో బ్లిట్జ్ గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ టోర్నీలో బరిలోకి దిగిన హంపి చివరికి విశ్వ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అలాగే లీ టింగ్జి రజత పతకంతో సరిపెట్టుకుంది. భారత్ నుంచి ఇప్పటి వరకూ విశ్వనాధన్ ఆనంద్ మాత్రమే చెస్ లో ప్రపంచ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడూ ఈ జాబితాలో హంపి కూడా చేరింది. మరోవైపు పురుషుల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ను నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ దక్కించుకున్నాడు.