భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన తోలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో ఏడు వికెట్లతో చెలరేగిన భారత్ పేసర్ మహమ్మద్ షమీ, డబుల్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో తమ కెరీర్ లోనే అత్యుత్తమ ర్యాంకులు అందుకున్నారు. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్లో మహమ్మద్ షమీ 7వ స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో షమీ కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ ర్యాంక్. భారత్ తరఫున టెస్టు క్రికెట్ లో అత్యధిక రేటింగ్ పాయింట్లు నమోదు చేసిన భారత బౌలర్లు కపిల్దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832) తరువాత 790 రేటింగ్ పాయింట్లుతో షమీ మూడో స్థానంలో నిలిచాడు.
ఇక భారత టెస్టు జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 691 పాయింట్లతో 11వ స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది టెస్టుల్లోనే అద్భుత ప్రదర్శన చేసిన మయాంక్ 858 పరుగులు చేశాడు. మయాంక్ కు టెస్టుల్లో ఇదే బెస్ట్ ర్యాంకు కావడం విశేషం. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో భారతజట్టు నుంచి విరాట్ కోహ్లీ (2), చటేశ్వర్ పుజారా (4), అజింక్య రహానె (5), రోహిత్ శర్మ (10) స్థానాల్లో ఉన్నారు. అలాగే భారత్ స్పిన్నర్ అశ్విన్ (10) టాప్-10లో చోటు సంపాదించగా, ఇషాంత్ శర్మ (20), ఉమేశ్ యాదవ్ (22) స్థానాల్లో కొనసాగుతున్నారు. మరో వైపు ఆల్రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా 417 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.