ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచే అవకాశమున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖలో చర్చిస్తున్నారు. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా భర్తీ చేసే పోస్టులకు వయోపరిమితిని పొడిగించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 ఏళ్ల వరకు పెంచిన వయోపరిమితి గడువు ఇటీవలే ముగిసింది. రాష్ట్రంలో మొదటగా ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాలు కాగా, వై.ఎ్స.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో దీన్ని 39 కు పెంచారు. ఆ తర్వాత కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వయోపరిమితిని 36 సంవత్సరాలుకు తగ్గించారు.
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపు ఉత్తర్వుల గడువు 2019 సెప్టెంబరు 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వయో పరిమితిని 42 సంవత్సరాల కంటే అదనంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలు పెంచే విషయాన్ని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తుంది. సంబంధిత అధికారుల మధ్య చర్చలు పూర్తయ్యాక అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
[subscribe]