ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా కౌంట్డౌన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు (మే 27, శుక్రవారం) హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్ పేరుతో 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు, క్రికెటర్ మిథాలి రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, సినీ ప్రముఖులు దిల్ రాజు, సందీప్ కిషన్, మంచు విష్ణుతో పాటుగా యోగా గురువులు, యోగా అనుబంధ శాస్త్ర నిపుణులు, స్థానిక యోగా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే ఈ యోగా ఉత్సవ్ లో యోగా ఔత్సాహికులు, ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ, యోగాను నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకోవాలన్నారు. యోగా వలన ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మరోవైపు ఈసారి 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (2022) యొక్క ప్రధాన కార్యక్రమాన్ని జూన్ 21వ తేదీన కర్ణాటకలోని మైసూరులో నిర్వహించనున్నారు. మైసూర్ లో జరిగే సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF