ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో అండగా ఉంటుందని, ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని చర్యలను తీసుకుంటున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. ఇప్పటికే దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 5,000కు పైగా ఆర్బీకే కేంద్రాల ద్వారా రబీ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు ఆయన గురువారం తెలిపారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిలో ఇప్పటివరకు 1,35,640 మంది రైతుల నుంచి 17.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం విక్రయించిన 21 రోజుల అనంతరం ఆయా రైతులందరికీ కలిపి మొత్తంగా రూ.700 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక రబీ సీజన్లో నష్టపోయిన రైతులకు సహాయక చర్యల కింద ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించామని, ఇంకా 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీపై అందించామని గుర్తు చేశారు. విత్తనం నుంచి అమ్మకం వరకు కౌలు రైతులతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, ఆర్బీకే స్థాయిలో ఈ-క్రాపింగ్ ద్వారా పంట దిగుబడిని అంచనా వేస్తామని, దీని వలన రైతులకు మేలు కలుగుతుందని గిరిజా శంకర్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ