ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ రోజు ఎంజీబీఎస్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశమానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, బేషరుతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామంటూ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించక పోవడంతో సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ గంటలపాటు చర్చించి, కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నా కూడ ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పారు. ఇప్పటి వరకు కార్మికులు ఏ డిపోలో కూడ విధుల్లో చేరలేదని, అసత్య ప్రచారాలు చేయవద్దని పేర్కొన్నారు.
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు విధుల్లో చేరే అంశంపై ప్రకటన చేస్తారని భావిస్తున్నామని చెప్పారు. సమ్మెకు కొనసాగింపుగా నవంబర్ 23, శనివారం నాడు అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శనివారం నాడు మరోసారి సమావేశమై భవిషత్తు కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. మరో వైపు కొన్ని డిపోల వద్ద విధుల్లో చేరేందుకు కార్మికులు సిద్దమవగా ప్రభుత్వ తుది నిర్ణయం వెలువరించే వరకు ఎవర్ని ఉద్యోగాల్లో చేర్చుకోవద్దని అన్ని డిపో మేనేజర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది.
[subscribe]